Thursday 31 December 2015

నాటకరంగ స్మృతులు: గోవిందరాజుల సుబ్బారావు

గోవిందరాజుల సుబ్బారావు(1895-1959) గురించి నాకు పెద్దగా తెలియదు. ఈ వ్యాసం చదివాక చాలా తెలిసింది. మాలపిల్ల, కన్యాశుల్కం వంటి సినిమాల్లో ఆయన నటన అద్భుతం.  కళాకారుడిగా, డాక్టరుగా  తన అనుభవాలను, గ్నాపకాలను ఆయన తేట తెలుగులో, మనసుకు హత్తుకునేలా ఎంత బాగా చెప్పారో చూడండి. ఇలాంటి వాటిని కదా మన పాఠ్యపుస్తకాల్లో పెట్టాల్సింది. ఇది కూడా భారతి పత్రికలోనిదే. సంచిక ఎప్పట్లాగే గుర్తులేదు. ఎప్పుడో డౌన్లోడ్ చేసినవి ఈ వ్యాసాలన్నీ. తర్వాత చెక్ చేసుకుందాంలేని అనుకున్నాను. ఇకపై ఇలాంటి పొరపాట్లు చెయ్యకూడదు. 
















Wednesday 30 December 2015

ఇటలీ తొలి చిత్రకారులు: మొక్కపాటి కృష్ణమూర్తి

పాశ్చాత్య చిత్రకళలో ఇటలీది తిరుగులేని స్థానం. పునరుజ్జీవన కళకు అది ఊయల. దాని తొలినాళ్ల చిత్రకారులను తెలుగు చిత్రకారుడు, కవి మొక్కపాటి కృష్ణమూర్తి(1910-1960) ఈ వ్యాసంలో ముచ్చటగా పరిచయం చేశాడు. ఇది 1953 భారతి మే సంచికలో వచ్చింది. ఇందులో ప్రస్తావించిన చిత్రకారుల చిత్రాలను జతచేసి అందిస్తున్నాను. నిజానికి ఈ వ్యాసాన్ని టైపు చేసి, బొమ్మలను ఆయా కళాకారుల ప్రస్తావన వద్ద ఉంచితేనే బావుంటుంది. సమయాభావంతో అలా చెయ్యలేకపోతున్నాను. 

 మొక్కపాటి కృష్ణమూర్తి









జియాతో ‘సెయింట్ ఫ్రాన్సిస్  నిర్యాణం‘

ఫ్రా ఏంజెలికో ‘అనౌన్సియేషన్’


ఉక్సెల్లో  వేసిన చిత్రంలో గుర్రాలు

పియెరో డెల్లా ఫ్రాన్సిస్కా చిత్రం

బొటిచెలీ వేసిన ‘వసంతం’
ఫిిలిప్పో లిప్పీ వేసిన మడోనా, కుమారుడు

Monday 28 December 2015

వాడు దోగాడిన చాప..








వాడైనా మిగులుంటే బావుండేది
ఈ దిక్కుమాలిన కొమ్మకు చిన్న ఆసరాగా..
తన కిలకిల నవ్వులతో 
నా వాడిన పెదాల్లో పూలై పూస్తూ..
ఆయనా లేకా, వాడూ లేక
ఎంతకాలమని ఈ ఖాళీ బండి మోత!
నా పిచ్చిగాకపోతే
వలపోసుకోడానికైనా నాకేం మిగులుందని
తొలిసంజెలోనే మలిసంజె మొదలైన బతుకు కదా ఇది..
ఊపిరాడదు కదా ఈ జాలీదయల గోదారులతో
పిచ్చిపిల్లనని, నష్టజాతకురాలినని
ఎన్నెన్ని సున్నితపు కత్తులతో మెత్తగా కోస్తారో...
అయినా గాయాలదేముంది
ఇరవై నిండకమునుపే
ఈ దేహం ఒట్టి కట్టెలా మారాక..
ఈ గర్భానికి మోయలేని శోకం మిగిలాక..
అయినా వాడు నా బిడ్డ కాదేమో
చిన్నప్పుడు నేనాడుకున్న బొమ్మేమో..
పన్నెండేళ్లకు చేసిన పెళ్లికి
రాలిపోయే బొమ్మలే పుడతాయేమో..
నా పిచ్చిగాని నేను మాత్రం బొమ్మను కానా ఏమిటి?
పదేళ్ల కిందట
నా బంగారు కొండ దోగాడిన చాపపై
ఈ సాయంత్రపు వెలుగు వరండాలో కూర్చుని
ఈ బొమ్మను చిత్రిక పడుతున్న నేను
బిడ్డను ఏట్లో పడేస్తున్న ఈ గంగమ్మలా
బండబారిపోయుంటే ఎంత బావుండేది..
తెలిపిలేని నా లోపలి గంగను మోస్తూ
బరువే ఎరగని వెర్రి దేవతలా..
తన బుజ్జాయితో సత్యవాణి(దామెర్ల బంధువులు, వి.కలికావతారం గార్ల సౌజన్యంతో)
(దామెర్ల సత్యవాణి(1907-1991) వేసిన ఈ రంగుల గంగమ్మ బొమ్మ చూశాక. సత్యవాణి ఒక్కగానొక్క కడుపు పంట ఆరునెలలు తిరక్కుండానే చనిపోయాడు. ఆ మరుసటి ఏడు..1925లో భర్త రామారావూ పోయాడు.)



‘గారు‘ కతేంది?



తెలుగు భాషలో గారు కు మించిన కిరికిరి పదం మరొకటి లేదనుకుంటా. కానీ ఈ గౌరవ సంబోధనలో ఆత్మీయత సున్నా. గౌరవం పదాల్లో ఉండదు, మనసులో, చేతల్లో ఉంటుంది. నాకైతే ఎవరినైనా నువ్వు..అంటూ పిలవాలనిపిస్తుంది అరమరికల్లేకుండా. మా రాయలసీమలో ఈ గారు ఇదివరకు తక్కువగా వినబడేది. ఇప్పుడు జాచ్చి అయింది. దీని పుట్టుపూర్వోత్వరాల వెనక పెద్ద కథే ఉన్నట్టుంది. వేలూరి శివరామశాస్త్రిగారు దీని గురించి ఏమంటున్నారో చదవండి.. ఇది భారతి పత్రికలో వచ్చింది. సంచిక గుర్తులేదు. 




Saturday 26 December 2015

Sunday 20 December 2015

డావిన్సీ.. కళ-జీవితం




అంతులేని వేదన, అద్భుత సంరంభం లెయొనార్దొ ద వించి గాథ







ఎన్ వేణుగోపాల్


ఇది లెయొనార్దొ ద వించి అనే పదిహేనో శతాబ్దపు ఇటాలియన్ చిత్రకారుడి జీవిత గాథ. రచయిత మోహన్ కవి, చిత్రకారుడు, చింతనాపరుడు. కవికి ఉండే ఊహాశాలిత, చిత్రకారుడికి ఉండే సమతౌల్య వర్ణదృష్టి, చింతనాపరుడికి ఉండే హేతుబద్ధత ఈ పుస్తకానికి మూలధాతువులు. ఆ మూడు లక్షణాలూ ఈ పుస్తకంలో అడుగడుగునా కనిపిస్తాయి. వస్తువూ పరిశీలకుడూ సౌందర్య సమన్వితాలైనప్పుడు ఫలితం ఎలా ఉంటుందో చూపడానికి ఈ పుస్తకం ఒక ఉదాహరణ. లెయొనార్దొ చిత్రాలన్నీ కళాఖండాలే. ఆ ఒక్కొక్క చిత్రం గురించీ మోహన్ రాసిన కవితాత్మక, ఆలోచనాస్ఫోరక వాక్యాలు అప్పటికప్పుడు ఆ చిత్రాన్ని చూడాలనీ, మోహన్ వివరణను ఆస్వాదిస్తూ కొత్త అర్థాలు అన్వేషిస్తూ ఉండాలనీ అనిపించేలా చేస్తాయి.
ప్రపంచానికంతా తెలిసిన మహానుభావులమీద ఉద్వేగభరితమైన నవలలు రాసిన ఇర్వింగ్ స్టోన్ తన కథానాయకుల జీవితం సమస్తాన్నీ కళ్లకు కట్టే పదబంధాలను సృష్టించి ఆ నవలల శీర్షికలుగా మలిచాడు. ఆ నవలలో ఒకటి పదహారో శతాబ్దపు చిత్రకారుడు మైకెలాంజెలో జీవితకథ అగొనీ అండ్ ఎక్ స్టసీ. ఆ పదబంధం ఆ నవలానాయకుడు మైకెలాంజెలోకు ఎంతగా సరిపోతుందో గాని, ఆయన కన్న ఇరవై ఏళ్లు పెద్దవాడు, చిత్రకళలో ఆయనకు ప్రత్యర్థి, డా విన్సీ అనే పొరపాటు పిలుపుతో ప్రఖ్యాతుడైన లెయొనార్దొ ద వించి కి అక్షరాలా సరిపోతుంది. లెయొనార్దొ జీవితమంతా అంతులేని వేదన, అద్భుత సంరంభం.
వివాహేతర సంబంధపు సంతానంగా, దాదాపు అనాథగా, ఎప్పటికప్పుడు ఏదో ఒక అవాంతరం తోసుకువచ్చి ఎక్కడా నిలకడగా ఉండనివ్వని నిరంతర జీవన అస్థిరత. చిన్నచిన్న రాజ్యాల మధ్య యుద్ధాలతో ఆ ప్రభువులను నమ్ముకున్న కళాకారుడిగా ఉత్థాన పతనాలు. బాల్యంలో కోల్పోయిన తల్లిదండ్రుల ప్రేమను, సోదరుల ప్రేమను పొందడానికేమో శిష్యులతో మెలగిన తీరుకు తప్పుడు వ్యాఖ్యానాలతో స్వలింగ సంపర్క నేరారోపణలు, విచారణలు, ఖైదు. తనకందిన పనుల్లో అనేకం బద్దకం వల్లనో, పరిపూర్ణతా భావనతోనో పూర్తి చేయలేకపోయిన అసంపూర్ణ ప్రజ్ఞ,…. ఆయన జీవితమంతా అంతులేని వేదనే.
మరొకపక్క చిన్ననాటి నుంచే ఆయన వేళ్లకొసలనుంచి జాలువారిన అద్భుత కళానైపుణ్యం. దేశదేశాల రాజుల, మతాధిపతుల, కళాభిమానుల, కళా విమర్శకుల ఆదరణ చూరగొన్న ప్రతిభా వికాసం, ఎప్పుడూ చుట్టూరా ఎంతో మంది శిష్యులు, అభిమానులు, ఒక్క చిత్రకళ మాత్రమే కాదు, దాదాపు ఆధునిక విజ్ఞానశాస్త్ర అన్వేషణలెన్నిటికో బీజరూప వ్యక్తీకరణలు – ఆయన జీవితమే అద్భుత సంరంభానికి ఎత్తిపట్టిన పతాక.
ఏదో ఒక శాస్త్రంలో, ఒక రంగంలో, ఒక చిన్న శాఖలో నైపుణ్యంతో మహా మేధావులుగా పేరు తెచ్చుకోగలుగుతున్న వర్తమాన స్థితితో పోల్చినప్పుడు యూరప్ లో భూస్వామ్యం నుంచి పెట్టుబడిదారీ విధానానికి సమాజం పరివర్తన పొందుతున్న యుగంలో మేధావులు ఎన్ని శాస్త్రాలలో, ఎన్ని రంగాలలో, ఎంత లోతయిన కృషి చేశారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. లెయొనార్దొ ఆ నాటికి శాస్త్రవేత్త, కళావేత్త. ఇవాళ్టి శాస్త్రాల, కళల పరిభాషలో చెప్పాలంటే గణితశాస్త్రజ్ఞుడు, నిర్మాణశాస్త్ర నిపుణుడు, మానవ శరీరశాస్త్రవేత్త, భూభౌతిక శాస్త్రవేత్త, భూ పటాల చిత్రకారుడు, వృక్షశాస్త్రవేత్త, చిత్రకారుడు, శిల్పి, వాస్తుశిల్పి, నీటిపారుదల వ్యవహారాల నిపుణుడు, సంగీతకారుడు, రచయిత. పునరుజ్జీవన యుగపు మానవుడికి మూర్తీభవ రూపం అని, అతనిది తీరని కుతూహల దాహం అనీ, అతనంత సర్వవ్యాపిత బహుముఖ ఆసక్తులు, ప్రజ్ఞా కలవారు లేరనీ ఎన్నెన్నో విశేషణాలున్నాయి. లెయొనార్దొను అర్థం చేసుకోవాలంటే ఆయన జీవించిన స్థల కాలాలను అర్థం చేసుకోవాలి.
పద్నాలుగో, పదిహేనో శతాబ్దపు ఇటలీ తొలి పునరుజ్జీవన సంస్కృతికి వేదిక. అప్పుడప్పుడే పుట్టుకొస్తున్న పెట్టుబడిదారీ విధానం భూస్వామ్యపు కరడుగట్టిన విలువలను తోసి రాజంటూ, రాజకీయ స్వాతంత్ర్యం, పట్టణ జీవితం, కళారాధన వంటి వ్యక్తి ప్రధాన, హేతుబద్ధ జీవిత విధానాలను ప్రవేశపెడుతోంది. రోమన్ సామ్రాజ్యం కూలిపోయిన ఐదో శతాబ్ది నుంచీ ఈ కదలికలు మొదలయిన పద్నాలుగో శతాబ్దం దాకా దాదాపు ఒక సహస్రాబ్ది యూరప్ చీకటిలో మగ్గిపోయిందని ఆ నాటి మేధావులు భావించారు. వాటిని మధ్యయుగాలు అని పిలిచారు. రోమన్ సామ్రాజ్యంలో గొప్ప కళా వికాసం పరిఢవిల్లిందని, అది మళ్లీ తలెత్తుతోందని, అది పునరుజ్జీవనమని వాళ్లు భావించారు. ఇదంతా సంప్రదాయం నుంచి ఆధునికతకు, బర్బరత్వం నుంచి నాగరికతకు ప్రయాణమని అనుకున్నారు. రోమన్, గ్రీక్ నాగరికతలలో లాగ మళ్లీ ఒకసారి పట్టణాలకు ప్రాధాన్యత వస్తున్నదని వాళ్లు వాదించారు. పూర్వీకులు వించి అనే గ్రామం నుంచి వచ్చినప్పటికీ, లెయొనార్దొ పుట్టినదీ, ఎక్కువకాలం గడిపినదీ ఫ్లారెన్స్ నగరంలోనే. ఆ నగరం 1460 నాటికే వర్తక కేంద్రం. అప్పటికే అక్కడ ముప్పై మూడు బ్యాంకులు ఉండేవి. బట్టల వ్యాపారం జోరుగా సాగేది. 270 ఉన్ని దుకాణాలు, ఎనబై ఎనిమిది వడ్రంగి దుకాణాలు, ఎనబై మూడు పట్టుబట్టల అంగళ్లతో యాభైవేల జనాభాతో అలరారుతుండిన నగరం అది.
ఈ చారిత్రక నేపథ్యమే లెయొనార్దొ జీవితాన్ని నిగూఢమూ చేసింది, సుసంపన్నమూ చేసింది. అప్పుడప్పుడే ఒక పెట్టుబడిదారీ వర్గం తలెత్తుతూ, అంతకు ముందరి భూస్వామిక రాచరిక మత కట్టుబాట్ల స్థానంలో లిఖితపూర్వక ఒప్పందాలు, ఆస్తి ఘర్షణలు మొదలవుతున్నప్పుడు పుట్టుకొచ్చిన నోటరీల, న్యాయవాదుల కుటుంబానికి చెందినవాడు లెయొనార్దొ. ఆయన తాత వ్యవసాయంలోకి దిగాడు గాని అంతకు ముందు మూడు తరాలు నోటరీలే. ఆయన తండ్రీ నోటరీయే, అలా ఆయన ఇంట్లోనే కొత్తవిలువల బతుకుకు పునాది ఉంది.
ఇక బైట సమాజంలో, కనీసం ఆలోచనాపర వర్గాలలో ఒక గొప్ప మేధో మథనం, సామాజిక సంచలనం సాగుతున్నది. అదంతా పునరుజ్జీవనమని ఆ నాటి మేధావులు భావించారు గాని మోహన్ అన్నట్టు “నిజానికి సామాన్య మానవుల విషయంలో మధ్యయుగాలకు, పునరుజ్జీవనానికి మధ్య ఎలాంటి తేడా లేదు. కేవలం కవులు, కళాకారులు, మేధావులకు మాత్రమే ఈ విభజన రేఖ పనికొస్తుంది. …పునరుజ్జీవన భావన కేవలం గుప్పెడు మంది కళాకారులకు, ధనిక వ్యాపార, కులీన, పాలక వర్గాలకు సంబంధించిన ఒక తాత్విక లోకం మాత్రమే.”
అయితే పునరుజ్జీవన భావన శిష్ట వర్గాలదే అయినా, పునాదిలో వస్తున్న మార్పులు గాలిలో కొత్త భావాలను వీచాయి. తూర్పు భళ్లున తెల్లవారింది, పాతలోకం కదలబారింది. వ్యక్తి వికాసం మొదలయింది. మానవచరిత్రలో ఇదివరకెన్నడూ లేనట్టుగా, వ్యక్తికి తన సామర్థ్యంపై తనకు అపార విశ్వాసం మొదలయింది. తన శక్తి సామర్థ్యాలు భగవద్దత్తమో, విధిలిఖితమో కాదని, తాను తలచుకుంటే తన భవిష్యత్తును తానే రూపుదిద్దుకోగలనని మనిషికి ఆత్మవిశ్వాసం మొదలయింది. సకల కళల్లో ఆరితేరిన విశ్వనరులు రూపొందాలని మనుషులు తలపోశారు. భూస్వామ్యం, మతం, సంప్రదాయం విధించిన బంధనాలను కూలదోసే వ్యక్తి స్వేచ్ఛా భావనలు తలెత్తాయి. లెయొనార్దొ చనిపోయినాక యాభై ఏళ్లకు పుట్టిన ఇంగ్లిష్ తత్వవేత్త ఫ్రాన్సిస్ బేకన్ “సమస్త జ్ఞానాన్నీ నా అధీనంలోకి తీసుకున్నాను” అని వ్యక్తీకరించిన ఆత్మవిశ్వాస ప్రకటన ఈ పునరుజ్జీవన భావనకు, ఆ భావన విస్తరణకు సూచికే.
సామాజిక పరివర్తన జరుగుతున్న ఆ పునరుజ్జీవన యుగం గొప్ప సంచలనాలకు, ఉద్వేగాలకు, అన్వేషణలకు ఆలవాలమైన కాలం. ఈ పునరుజ్జీవనం పారిశ్రామిక విప్లవానికి మూలమూ విస్తరణా కూడ. ఆ ప్రవాహంలో నుంచే ఆధునికత, వ్యక్తి ప్రాధాన్యత, హేతుదృష్టి, శాస్త్రవిజ్ఞానం, కాల్పనికత, ప్రకృతి సౌందర్యారాధన, మనిషి కూడ యంత్రమేననే ఆలోచన వంటి ఎన్నో కొత్త భావనలు, ధోరణులు పుట్టుకొచ్చాయి. పారిశ్రామిక విప్లవం యంత్రంలో చలనాన్ని సాధించింది. సమాజంలో చలనానికి కారణమైంది. ఆ కొత్తగాలులు వీచడం చూసిన మనుషులు తమ చుట్టూ చలనంతో పాటు తమ లోలోపలి చలనాల్ని కూడ గుర్తించారు. ఈ మూడు స్థాయిల చలనాలు పరస్పర అన్యోన్య ప్రభావాలతో మరింత విస్తృతమయ్యాయి. అందువల్లనే యూరప్ లో ఆ యుగం అత్యంత ప్రతిభావంతులైన, బహుముఖ ఆసక్తులు, ప్రజ్ఞలు కలిగిన మేధావులెందరినో సృష్టించింది. ఆ మేధావుల సుదీర్ఘ జాబితాలో తొలి తరం నాయకులలో ఒకరు లెయొనార్దొ.


చిన్నతనంలో లాటిన్, రేఖాగణితం, గణితం నేర్చుకున్న లెయొనార్దొ పద్నాలుగో ఏట చిత్రకళను అభ్యసించడానికి వెరాకియో స్టుడియోలో చేరాడు. అక్కడ సైద్ధాంతిక శిక్షణతో పాటు ఆచరణాత్మకంగా వైవిధ్యభరితమైన కళానైపుణ్యాలు నేర్చుకుని ఉంటాడని, ఆ సాంకేతిక నైపుణ్యాలలో రచన, రసాయనశాస్త్రం, లోహశాస్త్రం, లోహ వస్తువుల తయారీ, నమూనాల తయారీ, తోలు పని, యంత్రశాస్త్రం, వడ్రంగం, చిత్రకళ, శిల్పకళ వంటివి ఉండి ఉంటాయని చరిత్రకారులు రాస్తున్నారు. అలా ఇరవయో ఏట లెయొనార్దొ ఆనాటి వైద్యుల, కళాకారుల గిల్డ్ అయిన గిల్డ్ ఆఫ్ సేంట్ లూక్ లో సభ్యుడయ్యాడు. ఇటువంటి కళాకారుల, చేతివృత్తిదారుల గిల్డ్ లే  భూస్వామ్య బందిఖానా నుంచి శ్రామికులను విడుదల చేసి, పట్టణాలలో వారికి పని కల్పించాయి. నవనవోన్మేష అన్వేషణకూ, ఇతోధిక ఉత్పాదకతకూ మార్గం సుగమం చేసి చరిత్ర గమనానికి గొప్ప చోదకశక్తిగా అత్యద్భుతమైన పాత్ర నిర్వహించాయి.
అలా ఇటు సొంత ఇల్లు, పట్టణం కల్పించిన వాతావరణం, అటు సమాజంలో చెలరేగుతున్న సంచలనాలు కలిసి లెయొనార్దొ అనే వ్యక్తి వికాసానికి తగిన వనరులను సృష్టించిపెట్టాయి. అయితే, లెయొనార్దొ వంటి అపురూప వ్యక్తి రూపు దిద్దుకోవడాన్ని అర్థం చేసుకోవాలంటే ఇవి మాత్రమే సరిపోవు. ఆయన బహుముఖ ప్రజ్ఞకు ఆనాటి సామాజిక జీవనం పునాది అయితే, ప్రత్యేకించి కళా ప్రతిభకు కారణమేమై ఉంటుందని ఈ నాలుగు శతాబ్దాలలో చాల అన్వేషణ జరిగింది. కళా చరిత్రకారుల నుంచి కాల్పనిక రచయితల దాకా, రసాయన శాస్త్రవేత్తల నుంచి నేరపరిశోధనా శాస్త్రవేత్తల దాకా, మనస్తత్వశాస్త్రవేత్తల నుంచి సామాజిక శాస్త్రవేత్తల దాకా ఎందరెందరో ఇటు తొంగిచూశారు. లెయొనార్దొ ఫలానా చిత్రంలోని ఫలానా రేఖ, రంగు ఇందుకు సూచన అన్న దగ్గరి నుంచి, ఆయన బాల్యంలో అనుభవించిన ఫలానా సంఘటన, ఆయన బాల్యం నుంచి గుర్తున్న ఫలానా సన్నివేశం, ఆయన రచనలోని ఒక ఖండం ఆయనను ఎలా తీర్చిదిద్దాయో చాల వివరణలు వచ్చాయి.
ఆయన “…బాల్యం సంక్లిష్ట, సంఘర్షణాత్మక అనుభవాలతో గడిచింది. పల్లెలో తల్లి పెంపకం, వించీలో పెంపుడు తల్లి ఆలనా పాలనా, ఏ లోటూ రానివ్వకుండా చూసుకునే తండ్రి, అన్ని కష్టాలతో సతమతమయ్యే తల్లి, సవతి తండ్రి, సమాజంలో అక్రమ సంతానమనే ముద్ర, మరోపక్క గుండెలపై ఆనించుకునీ, భుజాలపై కూర్చోబెట్టుకునీ ముద్దుచేసే చిన్నాన్న. పెరిగి పెద్దయ్యే వయసులో కారుమబ్బులా ఆవరించిన ఒంటరితనం. ఈ అనుభవాలే అతని భావి జీవితానికి, కళకు ధాతువులయ్యాయి. అతని వ్యక్తిత్వ నిర్మాణానికి బాటలు పరిచాయి” అని మోహన్ అంటాడు.
నానమ్మ లూసియా వైపు కుండలు తయారు చేసేవాళ్లు. ఆ కుండల మీద చక్కని లతలు, జ్యామితీయ ఆకృతులు ఉండేవి. లెయొనార్దొకు ఆ కళావారసత్వం వచ్చి ఉంటుందనీ మోహన్ అంటాడు. “డావిన్సీది పక్కా జానపదుడి హృదయం. ప్రకృతి అతని ఆరాధ్య దేవత” అని బాల్యంలో వించీ చుట్టుపక్కల చూసిన జీవులు, రైతులు, వ్యవసాయ కూలీలు, వడ్రంగులు, పశువుల కాపర్లు ఎట్లా లెయొనార్దొ చిత్రాలలోకి ఎక్కారో వివరిస్తాడు. పల్లెల్లోని నూనె గానుగలను బాల్య కుతూహలంతో కళ్లింత చేసుకుని చూసిన లెయొనార్దొలో ఆ యంత్రాలే బీజం వేశాయనీ అతని నోటు పుస్తకాల్లో వందలకొద్దీ మొక్కలు, చెట్లు, పళ్లు కనిపిస్తాయనీ లెయొనార్దొ అనే అద్భుత వ్యక్తి తయారయిన మూల కారణాల సంక్లిష్టతను అర్థం చేయించడానికి మోహన్ ప్రయత్నిస్తాడు.
“దేన్నయినా సరే చూసి, విని, తాకి, శోధించి నిర్ధారణకు రావడం డావిన్సీ సిద్ధాంతం” అటాడు మోహన్. ఇది మొత్తంగానే పునరుజ్జీవన యుగపు సిద్ధాంతం. పెట్టుబడిదారీ అన్వేషణలకు మూలమైన సిద్దాంతం. బైబిల్ చెప్పిందనో, చర్చి చెప్పిందనో దేన్నీ అంగీకరించకు. పంచేంద్రియాలు ఉపయోగించి, హేతుబుద్ధిని ఉపయోగించి అర్థం చేసుకో అని మనిషి మీద మనిషికి విశ్వాసం కలిగించిన విలువలు అవి. మనిషిని విధి చేతిలోని కీలుబొమ్మలా కాక క్రియాశీల, సృజనాత్మక  ఉత్పత్తి శక్తిగా చూడకపోతే పెట్టుబడిదారీ విధానం లేచి నిలవడమే సాధ్యమయ్యేది కాదు. ఆ తొలిరోజుల, విప్లవాత్మక పెట్టుబడిదారీ ఆలోచనలు అందుకే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అని నినదించాయి. కాని అతి త్వరలోనే ఆ ప్రగతిశీల, ఉదాత్త, సర్వమానవ సౌభ్రాతృత్వ ధోరణి అంతా మణగిపోయింది. పెట్టుబడిదారీ విధానం మనిషిని విడుదల చేయదని, మనిషిని మనిషి దోపిడీ చేసే, పీడించే సాంఘికధర్మాన్ని బలోపేతం చేస్తుందని అర్థమయింది. పెట్టుబడిదారీ విధానం, పునరుజ్జీవన ఆధునికత ఈ వైరుధ్యాల పుట్ట.
పెట్టుబడిదారీ విధానం ఎదుగుతున్న క్రమంలో ఈ వైరుధ్యాలు అంతకంతకూ ఎక్కువగా బహిర్గతం కావడం మొదలయింది గాని ఒక సున్నిత సునిశిత మేధావిగా లెయొనార్దొ జీవితంలోనే ఈ వైరుధ్యాల బీజాలు గోచరిస్తాయి. “…యుద్ధంలో సైనికులను ఊచకోత కోయడానికి చరిత్ర ఎరుగని మారణ యంత్రాలను కూడా ఊహించి వాటికి కాగితాలపై రూపమిచ్చాడు. గుర్రాల వెన్నుతట్టి వాటి హృదయంతో సంభాషించిన డావిన్సీ, వాటిని పొడవాటి పదునైన కత్తుల రథానికి పూన్చి బొమ్మ వేయడానికి వెనుకాడలేదు. రంగుల్లో ప్రేమ జీవననాదాన్ని హృద్యంగా పలికించిన అతడు మనుషుల ఉసురు తీసే రోమాంచిత ఊహల్లోనూ తేలిపోయాడు….” అనీ, “పూలను, గడ్డిపోచలను ముగ్ధమనోహరంగా చూపిన డావిన్సీ ఈ కుత్తుకలు తరిగే మారణ యంత్రాలకు ఊపిరిపోయడం పెద్ద వైచిత్రి” అనీ అంటూనే “ఈ వైరుధ్యం, వైచిత్రి డావిన్సీ వైయక్తికమైంది మాత్రమే కాదు, నాటి సమాజం, రాజకీయాలు సృష్టించిన పరిస్థితులది కూడా” అంటాడు మోహన్.
అయితే లెయొనార్దొ జీవితంలో అణువణువునా కనిపించేది ప్రగాఢమైన అన్వేషణ. అది ప్రకృతి గురించీ కావచ్చు, జంతువుల గురించీ కావచ్చు. నీటి ప్రవాహాల గురించీ కావచ్చు.  కొత్త యంత్రాల గురించీ కావచ్చు, మానవ శరీరం గురించీ కావచ్చు, సమూహంలో వైవిధ్య భరితమైన మానవ ప్రవర్తన గురించీ కావచ్చు. మత భావనల చిత్రీకరణలలోనూ, మనుషుల చిత్రీకరణలోనూ ఆయన ఆ అన్వేషణా ఫలితాలన్నీ రంగరించాడు, రంగుల్లోకి దించాడు. రంగుల్లో కుదించాడు. ఆరు దశాబ్దాలు దాటిన ఆ మహాద్భుత వర్ణమయ జీవితాన్ని మోహన్ ఈ పుస్తకంలో అంతే వర్ణమయంగా అక్షరాలకెక్కించాడు.
నిజానికి ఇది ముందుమాట గనుక, దీనికి నిడివి పరిమితి ఉంది గనుక ఇంక ఎక్కువ రాయను, ఎన్నెన్నో భాగాలను యథాతథంగా ఉటంకించాలనే కోరికను అణచుకుంటున్నాను.
మిలాన్ పాలకుడు లుడొవికో దగ్గర కొలువు కోసం తనకు ఏయే కళలు వచ్చునో లెయొనార్దొ రాసిన లేఖ, లెయొనార్దొ మిగిల్చి పోయిన దాదాపు ఆరువేల పేజీల నోట్స్, లెయొనార్దొ వేసిన చిత్రాలలో చాల భాగం చెడిపోవడంలో కాలం పాత్ర, మనిషి పాత్ర, మిలాన్ సమీపంలో ఆల్ప్స్ పర్వతాలలో నదుల గురించి లెయొనార్దొ చేసిన అన్వేషణలు, లెయొనార్దొ రాసిన చిత్రకళా బోధిని, చేసిన యంత్రాలు, యంత్ర భాగాలు, మానవ శరీర నిర్మాణం గురించి తెలుసుకోవడానికి మృతదేహాలపై లెయొనార్దొ చేసిన ప్రయోగాలు, ప్రకృతి, ఖగోళ శాస్త్ర అన్వేషణలు, అద్దాలపై, కటకాలపై అన్వేషణలు, మతభావనలు, వృద్ధాప్యపు కల వంటి అనేక సందర్భాలలో మోహన్ రచన పాఠకులను సమ్మోహితులను చేస్తుంది, ఐదువందల ఏళ్ల వెనక్కి, ఆ నాటి సామాజిక సాంస్కృతిక వాతావరణంలోకి తీసుకుపోతుంది. ఇక చిత్రాల గురించి – మరీ ముఖ్యంగా జినిర్వా, జెరోమ్, సెయింట్ ఆన్, ఆంగియారి, మోనాలిసా, సెయింట్ జాన్, సిసిలియా, లుక్రీజియా వంటి ఎన్నో చిత్రాల – వివరణలైతే ఒక వచన రచయిత, కళా విమర్శకుడు మాత్రమే చేయగలిగేవి కావు. స్వయంగా చిత్రకారుడు, రంగుల, రేఖల స్వభావ స్వరూపాలు కూలంకషంగా తెలిసిన కళా మర్మజ్ఞుడు మాత్రమే రాయగలిగినవి.
“డావిన్సీ చిత్రకళా సృజనను పక్కనపెడితే అతడు ఇంజనీరింగ్, వాస్తు వగైరా రంగాల్లో కంటే అనాటమీలోనే ఘన విజయాలు సాధించాడు. సుతిమెత్తని కుంచెలు పట్టుకున్న చేతుల్తోనే కరకు కత్తులు పట్టుకుని మృత మానవ దేహాలను రక్తమంటిన చేతులతో శోధించాడు. మానవ గుండెను కుడిచేత్తో పట్టుకుని రక్తపు మరకలంటిన కాగితంపై ఎడమ చేత్తో దాని రూపాన్ని చిత్రించాడు… మనిషి బయటి, లోపలి నిర్మాణాన్ని స్పష్టంగా, విశ్లేషణాత్మకంగా, నిర్దుష్టంగానే కాకుండా కళాత్మకంగా కూడా చూపిన తొలి అనాటమీ కళాకారుడు డావిన్సీనే. అతడు తన అనాటమీ చిత్రాలతో కళాకారుడికి, శాస్త్రవేత్తకు మధ్య ఉన్న తేడాను చెరిపేశాడు…. అతని జ్ఞానపిపాసను మతం అడ్డుకోలేకపోయింది” అనీ, “కళ్ల కదలికలకు కారణమేంటి? కనుబొమలు ఎలా ముడిపడతాయి? కనురెప్పలు ఎందుకు మూతపడతాయి? ముక్కుపుటాలు, నోరు, పెదవులు తెరచుకోవడం, మూసుకోవడం వెనుక ఉన్న యంత్రాంగమేమిటి? ఉమ్మడం వెనుక మతలబేంటి? ఎందువల్ల నవ్వుతున్నాం, ఆశ్చర్యపోతున్నాం అని డావిన్సీ ప్రశ్నించుకున్నాడు. ఈ ప్రశ్నలను ఓ పుర్రెబొమ్మ వేసిన కాగితం వెనక రాసుకున్నాడు. చీదడం, ఆకలి, నిద్ర, మైథునం, చెమట, కండరాల కదలికలకు కారణమేంటో తెలుసుకోవాలని రాసుకున్నాడు” అనీ అంటాడు మోహన్.
నిజానికి మోహన్ రచనలో ఇటువంటి ఆర్ద్ర, సున్నిత, కాల్పనిక, కళాత్మక వ్యక్తీకరణలను ప్రేరేపించగల శక్తి లెయొనార్దొ జీవితంలోనే ఉంది. స్వయంగా లెయొనార్దొ మనకోసం వదిలిపెట్టిపోయిన రచనలలో కూడ ఉంది. ఉదాహరణకు, “ఆత్మికోద్వేగాలను భంగిమల ద్వారా చెప్పగలిగితేనే చిత్రానికి విలువ ఉంటుంది”, “నా శ్రమతో ప్రకృతిలోని రహస్యాలు బట్టబయలవుతాయి”, “ఒకసారి అధ్యయనం చేసిన వాటి గురించి రాత్రిపూట ఆలోచిస్తే మంచిదని స్వానుభవంతో చెబుతున్నా. మనం పడుకున్నప్పుడు రాత్రి నిశ్శబం వల్ల ఆలోచన పదునెక్కుతుంది. దాంతో మనం సృజించిన వాటిని మరింత పరిపూర్ణంగా తీర్చిదిద్దగలం”, “పోషకులు మొదట్లో నిన్ను ఆకాశానికెత్తేస్తారు. తర్వాత కష్టమైన పనులు అప్పగిస్తారు. ఆ తర్వాత విశ్వాసహీనంగా ప్రవర్తిస్తారు. ఆపై నిన్ను నిందిస్తారు”, “అచ్చేసిన పుస్తకాల మాదిరి చిత్రాలకు పెద్దసంఖ్యలో నమూనాలు ఉండకూడదు. ఒక చిత్రం ఒక చిత్రంగానే ఉండాలి. పిల్లల్ని పుట్టించగూడదు. అప్పుడే అది ప్రత్యేకంగా, మిగతా వాటికంటే గొప్పగా భాసిల్లుతుంది”, “పక్షి గణిత సూత్రాల ఆధారంగా పనిచేసే యంత్రం. ఆ యంత్రాన్ని మనిషి తయారు చేయగలడు. అయితే అతని యంత్రానికి పక్షికున్నంత శక్తి ఉండదు. పక్షి హృదయమూ ఉండదు. కనుక మనిషి ఆ లోపాన్ని యంత్రానికి తన హృదయాన్ని అందించి అధిగమించాలి” వంటి ఆణిముత్యాలెన్నో లెయొనార్దొ రచనల్లో ఉన్నాయి.
“చిత్రకారుడు సమస్త జీవజాలపు, ప్రకృతి సారాంశం. జంతువులు, మొక్కలు, పళ్లు, మైదానాలు, శిఖరాలు, భయం గొల్పే ఆవరణలతో పాటు ఆహ్లాదకర ప్రాంతాలు, గాలి వాలుకు తూలిపోయే రంగురంగుల పూలతో కూడిన పొదలు, ఎత్తయిన పర్వతాల నుంచి బలంగా కిందికి దూకే నదులు, వాటిలో కొట్టుకుపోయే రాళ్లు, చెట్ల వేళ్లు, మన్ను, నురగ, ఝంఝామారుతంతో ఎదురొడ్డి పోరాడే తుపాను కడలి సారాంశం… చిత్రకారుడు… మానవుల్లోని సౌందర్యం నశిస్తుంది. కాని కళలోని సౌందర్యం నశించదు” అన్నాడు లెయొనార్దొ ద వించి.
ఆ చిత్రకారుడు మరణించి ఐదువందల సంవత్సరాలు గడిచింది. ఆయన కళలోని సౌందర్యం చిరంజీవిగా వర్ధిల్లుతోంది. ఆ నిరంతర నవనవోన్మేష సౌందర్యానికి ఎలుగెత్తిన మోహన గానం ఈ పుస్తకం. చదవండి.
Da Vinci – 1/8 demy, 264+8 pages, Rs. 150, Kaki Prachuranalu
For copies: All leading book shops/
Kaki Prachuranalu, Plot No. 304, H.No. 3-5-118/15, Second Floor, GPR Nilayam, Krishnanagar, Hyderguda, Rajendranagar, Hyderabad 500048, Ph: 9949052916

అజంతాలో సంఘజీవులు


Friday 18 December 2015

కాండీడ్-6వ భాగం





సారంగ సాహిత్య వారపత్రికలో వస్తూ ఉండిన వోల్టేర్ నవల ‘కాండీడ్’ అనువాదం అనివార్య కారణాల వల్ల ఆ పత్రికలో ఆగిపోయింది. ఈ అనువాదం ఇక నుంచి కళాసాహితి బ్లాగులో కొనసాగుతుంది. పూర్వకథను ఆ  పత్రికలో చదువుకోవచ్చు. వీలునుబట్టి ఆ పాత భాగాలనూ ఇందులో పోస్ట్ చేస్తాను.
 -పి.మోహన్


(గడిచిన కథ.. కాండీడ్ అంతా మనమంచికేనని నమ్మే ఆశాజీవి. క్యూనెగొండ్ అతని ప్రియురాలు. కష్టాల్లో చిక్కుకున్న ఆమెను కాండీడ్ కాపాడి, ఆమె దాసి అయిన ముసలమ్మతోపాటు పరాగ్వేకి బయల్దేరతాడు. ప్రయాణంలో ముసలమ్మ తన కథ చెప్పడం మొదలు పెట్టింది..)






11వ అధ్యాయం


అమ్మా, నా కళ్లు ఎప్పుడూ ఇలా చింతనిప్పుల్లా మండేవి కావు. ముక్కు ఇంత ఘోరంగా దిగజారి గడ్డాన్ని తాకేది కాదు. అసలు నేనిలా ఎప్పుడూ దాసిగా ఉండిందే లేదు. నేను పోప్ పదో అర్బన్ కు, పాలస్త్రీనా రాకుమార్తెకు పుట్టాను. పద్నాలుగేళ్లు వచ్చేవరకు అందమైన భవనంలో సుకుమారంగా, ఏ లోటూ లేకుండా పెరిగాను. మీ మొత్తం జర్మన్ జమీందార్ల భవంతులకంటే మా భవనంలోని గుర్రాల పాకలే రమణీయంగా ఉండేవనుకో. మీ వెస్ట్ ఫేలియాను మొత్తం కలిపి విలువ కట్టినా నేను తొడిగి పారేసిన ఒక్క గుడ్డపాటి ఖరీదు చేసేది కాదు. రోజులు గడిచేకొద్దీ అందంగా, నాజూకుగా తయారవసాగాను. మాట చాతుర్యమూ పెరిగింది. రోజులు సంతోషంగా, అశావహంగా గడచిపోయేవి. ఎక్కడికెళ్లినా నీరాజనాలు పట్టి పొగడ్తలతో ముంచెత్తేవాళ్లు. అందరూ నన్ను పొందాలని పరితపించిపోయేవాళ్లు. నా వంపుసొంపులు రోజురోజుకూ ఇనుమడించసాగాయి. రొమ్ములు తీర్చిదిద్దినట్లు పెరిగి, ఎంత అందగా ఉండేవని! తెల్ల లిల్లీపువ్వుల్లా, బిగువుగా, మెడిచీ వీనస్ దేవత బొమ్మ రొమ్ముల్లా మనోహరంగా ఉండేవి. కళ్ల సంగతి ఇక చెప్పక్కర్లేదు. కనురెప్పలు ఆల్చిప్పల్లా, కనుబొమలు నల్లగా మెరిసిపోతుండేవి. నా కనుపాలల్లోని కాంతి ముందు ఆ నక్షత్రాలు కూడా వెలవెలబోతాయని మా కవిజనం కీర్తించేవాళ్లు. నా చెలికత్తెలు నాకు బట్టలు తొడిగేటప్పుడు, విప్పేటప్పుడు నా దేహసంపదను ముందూ, వెనకా కళ్లింతలు చేసుకుని అలాగే చూస్తుండిపోయేవాళ్లు. వాళ్ల స్థానం ఆక్రమించి నా సేవలో తరించిపోవాలని ఉవ్విళ్లూరని మగాడే లేడనుకోండి.

నన్ను మసా కారారా రాకుమారునికిచ్చి పెళ్లిచేయాలని నిశ్చితార్థం చేశారు. అందులో అతడు నాకు సరిజోడు. సరససల్లాపాల్లో దిట్ట. ప్రేమజ్వరతో నిలువెల్లా కాలిపోయేవాడు. నేను కూడా అంతే, తొలివలపంత గాఢంగా అతన్ని ప్రేమించాను. మా పెద్దలు మా పెళ్లిని ఆకాశమంత పందిరి వేసి, భూలోకమంత పీటలు వేసి ఘనంగా చెయ్యాలనుకున్నారు. ఏర్పాటు మొదలయ్యాయి. విందులు, నాట్యాలు, ఊరేగింపులు.. విరామం లేకుండా సందడిగా సాగుతున్నాయి. ఇటలీ దేశం మొత్తం నాపై పాటులు, పద్యాలు రాయడంతో మునిగిపోయింది. అయితే వాటిలో చెప్పుకోదగ్గది ఒక్కటీ లేదనుకోండి. పెళ్లిలో అలా నా ఆనందం అంబరాన్ని తాకుతుండగా, రాకుమారుని ముసలి దాది అతణ్ని తనతో పాటు కొంచెం చాక్లెట్ పానీయం తాగాలని పిలిచింది. తర్వాత పట్టుమని రెండు గంటలు గడవకముందే అతడు గిలగిలా తన్నుకుని చచ్చిపోయాడు. అయినా నాకు అదేమంత పెద్దదెబ్బ కాదనుకోండి. మొత్తానికి అతని మరణంలో కలతచెందాను. మా అమ్మకూడా దిగాలు పడిపోయింది కాని, నా అంతగా కలవరపడలేదు. ఆ విషాదాన్ని మరచిపోవడానికి ఆమె గేటాలోని తన అందమైన జమీకి వెళ్లిపోవాలని నిర్ణయించింది. రోమ్ నగరంలో సెయింట్ పీటర్స్ చర్చి పూజాపీఠంలా అందంగా అలంకరించిన నావలో బయల్దేరాం. కొన్ని మైళ్లు పోయామో లేదో, మూర్ జాతి సముద్రపు దొంగలు మా ఓడను చెరబట్టారు. మా అంగరక్షకులు ఆత్మరక్షణ కోసం పోప్ అంగరక్షకుల్లా వీరోచితంగా ఆ దొంగల కాళ్లపైపడిపోయి, ఆయుధాలు కిందపడేసి, ప్రాణభిక్ష పెట్టాలని దేబిరించారు.

తర్వాత మా భటులందరికీ గుడ్డలు ఊడదీశారు. వాళ్లు తోకల్లేని కోతుల్లా తయారయ్యారు. మా అమ్మకు, నాకు, మా చెలికత్తెలకు కూడా అంతకుమించిన గౌరవమర్యాలు దక్కలేదనుకోండి. వాళ్లు మా బట్టల్ని రెప్పపాటులో ఊడదీయడం నాకు భలే గమ్మత్తుగా అనిపించింది. కానీ స్త్రీలు ఎంతో జాగ్రత్తగా కాపాడుకునే, సిరంజి గొట్టం మినహా మరి దేన్నీ అనుమతించని మర్మావయవాల్లో ఆ దొంగలు వేళ్లు పెట్టడం నాకు అంతకంటే ఆశ్చర్యాన్ని కలిగించింది. అదో వింత ఆచారంలా తోచింది. మనం తొలిసారి స్వదేశాన్ని వదలగానే మనకు తెలియని ప్రతిదాన్నీ వింతగానే భావిస్తాం కదా. మేం జననాంగాల్లో వజ్రాలూ, నగలూ గట్రా దాచుకున్నామేమోననే అనుమానంతో వాళ్లు అలా వెతికారని తర్వాత నాకు అర్థమైంది. పూర్వం సముద్రయానం చేసిన నాగరిక జాతులన్నీ ఈ ఆచారాన్ని పాటించాయట. మాల్టా క్రైస్తవ ధర్మపరిరక్షక వీరయోధులు తురుష్కులను ఖైదీలుగా పట్టుకున్నప్పుడు ఆడామగా తేడాల లేకుండా అందర్నీ ఇలా శోధించేవాళ్లని, దీనికి సంబంధించి అంతర్జాతీయ న్యాయసూత్రాల్లో ఎలాంటి సమస్యలూ తలెత్తవని నాకు తర్వాత తెలిసింది.

దొంగల ఓడలో మొరాకోకు బానిసలుగా వెళ్తున్న ఒక రాకుమారికి, ఆమె తల్లికి ఎంత కష్టంగా ఉంటుందో మీకు విడమరచి చెప్పాల్సిన పనిలేదు. మా అమ్మ అప్పటికింకా అందంగానే ఉండేది. మా పరిచారికలు, ఆయాలు కూడా అందగత్తెలే. మొత్తం ఆఫ్రికాను జల్లెడపట్టినా వాళ్లకు సాటి వచ్చే వాళ్లెవరూ దొరకరు. ఇక నా వరకు వస్తే, నేను కుందనపు బొమ్మను, పైగా కన్యను. కానీ నా కన్యాత్వం ఎంతోకాలం నిలవలేదు. సుందరాంగుడైన మసా కరారా రాకుమారుని కోసం భద్రంగా కాపాడుకున్న నా యవ్వనపుష్పాన్ని ఆ ఓడ దొంగల కెప్టెన్ తెంపేసి, దారుణంగా ఆస్వాదించి, నలిపిపారేశాడు. అతగాడు నీగ్రో, వికృతంగా ఉండేవాడు. ఆ ఘాతుకానికి పాల్పడింది చాలక, అదేదో నాకు పేద్ద గౌరవమన్నట్టు వాగాడు. నేనూ, మా అమ్మా మొరాకో చేరేవరకు ఆ కష్టాలను తట్టుకోగలిగామంటే గుండె ధైర్యమున్నవాళ్లమనే అనుకోవాలి. అయినా అవి మామూలు కష్టాలేలే, చెప్పుకోదగ్గవి కావు.

మేం మొరాకోలో అడుగుపెట్టేసరికి అది నెత్తుటేర్లలో ఓలలాడుతోంది. చక్రవర్తి ములే ఇస్మాయిల్‌కు యాభై మంది కొడుకులు. ఒక్కొక్కడికీ ఒక్కో ముఠా ఉంది. అవన్నీ కలబడ్డంతో ఒక్కసారిగా యాభై అంతర్యుద్ధాలు చెలరేగాయి. నల్లవాళ్లు నల్లవాళ్లతో, గోధుమరంగు వాళ్లతో కలబడ్డారు. గోధుమరంగు వాళ్లు గోధుమరంగు వాళ్లపై కలబడ్డారు. నల్లవాళ్లకు, తెల్లవాళ్లకు పుట్టినవాళ్లు అలాంటివాళ్లపై కత్తులు దూసుకున్నారు. రాజ్యం నలుమూలలా నరమేధం నిరాఘాటంగా సాగింది.

మేం రేవులో దిగీదిగగానే మా ఓడ కెప్టెన్ విరోధులైన నల్లవాళ్ల ముఠా ఓడను దోచుకోవడానికి వచ్చింది. వజ్రాలు, బంగారం తప్పిస్తే అందులో మేమే విలువైన వస్తువులం. ఒకళ్లపై ఒకళ్లు కలబడి దారుణాతిదారుణంగా నరుక్కున్నారు. మన యూరప్‌లో ఎక్కడా అలాంటి రక్తపాతాన్ని చూసెరగమంటే నమ్మండి. ఏదేమైనా ఒక మాట చెప్పుకోవాలి.. మన ఉత్తరాది జాతులకు ఉడుకు రక్తం తక్కువ. మన మగవాళ్లకు మగువలను చూస్తే కోరిక రేగదు. అదే ఆఫ్రికన్లలోనైతే అది కార్చిచ్చులా రగిలిపోతుంది. మన యూరోపియన్ల నాళాల్లో ఉత్తి పాలు మాత్రమే ప్రవహిస్తున్నాయనిపిస్తుంది. అట్లాస్ పర్వతంపైనా, దాని చుట్టుపక్కలా నివసించేవాళ్ల నాళాల్లోనైతే మంటలు, గంధక ద్రఃవణం ప్రవహిస్తూ ఉంటాయి. సరే.. రేవు దగ్గర ఏం జరిగిదంటే.. మమ్మల్ని ఎవరు వశం చేసుకోవాలో తేల్చుకోవడానికి వాళ్లు తమ దేశంలోని  సింహాల్లా, పులుల్లా, కాలనాగుల్లా కొట్లాడుకున్నారు.  ఒక మూర్ మా అమ్మ కుడి భుజాన్ని లాగాడు. మా ఓడ కెప్టెన్ కింద పనిచేసే చిన్న కెప్టెన్ ఎడమ భుజాన్ని పీకాడు. ఒక మూర్ సైనికుడు ఒక కాలు, మరో దొంగ మరో కాలు పట్టుకున్నాడు. ఈ విధంగా మాలో దాదాపు ప్రతి ఒక్కళ్లనూ నలుగురేసి చెరపట్టి తగవులాడుకున్నారు. ఓడదొంగల కెప్టెన్ మాత్రం నన్ను తన వెనకాల బహుజాగ్రత్తగా కాపాడుకుంటూ తనతో కలియబడినవాడినల్లా తన కత్తికి బలిపెడుతూపోయాడు. నా తల్లితోపాటు ఇటాలియన్ అతివలందర్నీ ఆ దుర్మార్గులు ఆ పాడు పెనుగులాటల్లో కాళ్లూచేతులూ చీల్చేసి, ముక్కలు ముక్కలు చేశారు. చివరాఖరికి అటు బందీలూ, ఇటు బంధించినవాళ్లూ అందరూ ఖతమమయ్యారు.
నా తోటి ఆడవాళ్లు, సైనికులు, సరంగులు, బానిసలు, నల్లవాళ్లు, తెల్లవాళ్లు, సంకరజాతి వాళ్లు, చివరగా దొంగల కెప్టెనూ అందరూ నేలకొరిగారు. నేనొక్కత్తెనూ ఆ పీనుగుల గుట్టపై చావుకు సిద్ధంగా పడి ఉన్నాను. మూడువందల చదరపు లీగుల విస్తీర్ణమున్న ఆ దేశమంతటా ఇలాంటి దృశాలే కనిపిస్తూ ఉంటాయి. అయితే అక్కడి ప్రజలు మాత్రం మహమ్మద్ ప్రవక్త రోజుకు ఐదుసార్లు చేయమని చెప్పిన నమాజును పొరపాటున కూడా మరచిపోకుండా పూర్తి చేస్తారు.

నెత్తురోడుతున్నఆ శవాలగుట్ట మీంచి అతికష్టంతో కదలి, కాళ్లీడ్చుకుంటూ దగ్గర్లోని ఓ వాగు పక్కన ఉన్న నారింజ చెట్టు నీడకు చేరుకున్నాను. భయం, ఆందోళన, ఆకలి, నిస్సత్తువ ముప్పిరిగొనడంతో కుప్పకూలిపోయాను. మగత కమ్మేసింది. అలా చావుబతుకుల నడుమ కొట్టుమిట్టాడుతూ ఉండగా, నా శరీరాన్ని ఎవరో సున్నితంగా ఒత్తుతూ, కదల్చినట్లు అనిపించింది. కళ్లు తెరిచి చూశా. ఎదురుగా ధవళవర్ణ సత్పురుషుడొకడు నిట్టూరుస్తూ, ‘‘మగసిరి కోల్పోవడం ఎంత దురదృష్టం..’’ అని గొణుగుతూ కనిపించాడు.





12వ అధ్యాయం

నా మాతృభాష చెవినబడేసరికి నాకు బోలడంత ఆశ్చర్యం, సంతోషం కలిగాయి. అతని గొణుగుడు మరింత విస్మయాన్ని రేకెత్తించింది. అతని దురదృష్టంకంటే దారుణమైన కష్టాలు లోకంలో చాలా ఉన్నాయని బదులిచ్చాను. నేను పడిన భయంకర బాధలను క్లుప్తంగా వివరించి మళ్లీ స్పృహ తప్పి పడిపోయాను. అతడు నన్ను దగ్గర్లోని ఓ ఇంట్లోకి తీసుకెళ్లి పక్కపై పడుకోబెట్టాడు. తిండి పెట్టి ఓదార్చాడు. నా కంటే అందగత్తెను తానెక్కడా చూడలేదన్నాడు. తాను కోల్పోయినదాన్న భర్తీ చేయడం అసాధ్యమని వగచాడు.

‘‘నేను నేపుల్స్‌లో పుట్టాను. అక్కడ ఏటా రెండు, మూడువేల మంది పిల్లలకు వృషణాలు కోసేస్తారు. కొందరు శస్త్ర చికిత్సలోనే చనిపోతారు. మరికొందరికి స్త్రీలకంటే మధురమైన గాత్రం వస్తుంది. కొందరు ప్రధానమంత్రులవుతారు. నా శస్త్రచికిత్స దిగ్విజయంగా జరిగింది. నేను పాలస్త్రీనా యువరాణి కొలువులో సంగీత విద్వాంసునిలా కుదిరాను’’ అని తన కథ చెప్పాడు.

పాలస్త్రీనా యువరాణికా? అంటే మా అమ్మకా!’ నేను ఆశ్చర్యంతో అడిగాను.

‘‘మీ అమ్మకా! అంటే.. నేను ఆనాడు పాఠాలు నేర్పిన ఆ చిన్నారి రాకుమార్తెవు నువ్వేనా? నీకు ఆరేళ్లొచ్చేవరకు పాఠాలు చెప్పా కదా. అంత చిన్నప్పుడే నువ్వు సౌందర్యరాశిగా తయారవుతానన్నట్టు ఉండేదానివి సుమీ..’’

‘‘ముమ్మాటికీ నిజం! అయితే మా అమ్మ నీకిప్పుడు ఇక్కడికి సరిగ్గా నాలువందల గజాల దూరంలో ముక్కలుముక్కలుగా నరకబడి, పీనుగులదిబ్బ కింద కనిపిస్తుంది’ అని బదులిచ్చాను.

నేనతనికి నా బాధలను, ఘనకార్యాలను వివరించాను. అతడు కూడా తన సాహసాలను వివరించాడు. ఇతర క్రైస్తవ రాజ్యాల వ్యాపారాలను దెబ్బ తీయడానికి మందుగుండు, ఫిరంగులు, యుద్ధనౌకలు ఇచ్చి సాయం చేయాలని ఓ క్రైస్తవ యువరాజు తనను మొరాకో చక్రవర్తి వద్దకు రాయబారిగా పంపాడని చెప్పాడు.

‘‘నా రాయబారం పూర్తయింది. నేను మళ్లీ మన సీటాకు వెళ్తున్నాను. నిన్ను కూడా ఇటలీకి తీసుకెళ్తాను’’ అని హామీ ఇచ్చాడు.   

అతని కారుణ్యానికి కదలిపోయాను. గుడ్ల నీళ్లు కక్కకుని కృతజ్ఞతలు చెప్పాను. అయితే అతడు నన్ను ఇటలీకి తీసుకెళ్లకుండా అల్జీర్స్ కు తీసుకెళ్లి అక్కడి గవర్నర్ కు అమ్మిపారేశాడు. నన్నలా అమ్మేశాడో లేదో,ఇంతలో ఆఫ్రికా, ఆసియా, యూరప్‌లలో అల్లుకుపోయిన ప్లేగు అల్జీర్స్‌ కు కూడా పాకి ఉధృతరూపం దాల్చింది. అమ్మా! మీకు భూకంపాలెలా ఉంటాయో తెలుసు. కానీ మీకెప్పుడైనా ప్లేగు వచ్చిందా అమ్మా..!

‘’లేదు..’’ బదులిచ్చింది క్యూనెగొండ్.

వచ్చి ఉంటే అది భూకంపం కంటే భయంకరమైందని మీరు ఒప్పుకునితీరేవాళ్లు. అది ఆఫ్రికాలో అతి సామాన్యం. నాకూ సోకింది. పట్టుమని మూడు నెలల వ్యవధిలో దారిద్ర్యం, బానిసత్వం, రోజూ బలాత్కారం, కళ్లముందే తల్లిని ముక్కలుముక్కలుగా నరకడం, కరువు, యుద్ధబీభత్సాలు, ప్రాణం తోడేసే మహమ్మారినీ చవిచూసిన ఒక పోప్ కూతురి, పదిహేనేళ్ల చిన్నదాని  దురవస్థను మీరే ఊహించుకోండి. కానీ నేను మాత్రం చచ్చిపోలేదు. ఆ కొజ్జా, ఆ గవర్నరూ, అల్జీర్స్ జనానాలోని అందరూ ప్లేగులో అంతమైపోయారు.

ఆ మహమ్మారి బీభత్సం కాస్త తగ్గగానే గవర్నర్ బానిసలందరినీ తెగనమ్మేశారు. నన్ను ఓ వర్తకుడు కొనుక్కుని ట్యూనిస్ కు తీసుకెళ్లాడు. అక్కడ మరో వర్తకుడికి అమ్మేశాడు. అతడు మరో వ్యాపారికి అమ్మేశాడు. ఆ వ్యాపారి ట్రిపోలీకి తీసుకెళ్లి అమ్మేశాడు. అలా అలా చేతులు మారుతూ మారుతూ ట్రిపోలీ నుంచి అలెంగ్జాండ్రియాకు, అక్కడి నుంచి స్మిరాకు, కాన్‌స్టాంటినోపుల్‌కు వెళ్లిపోయాను. చిట్టచివరకు అక్కడ టర్కీ సుల్తాన్ అంగరక్షకుల్లోని ఓ దళనాయకుడి చేతుల్లో పడ్డాను. తర్వాత అతణ్ని రష్యన్లను ఎదుర్కోవడానికి అజోవ్‌కు వెళ్లాలని ఆదేశించారు.

ఆ దళనాయకుడు మంచివాడు, యోధుడు. నాతోపాటు తన చిన్న జనానాలోని అందర్నీ అజోవ్‌కు తీసుకెళ్లి సముద్రం మధ్యలోని దీవిలో ఉన్న చిన్న కోటలో ఉంచాడు. ఇద్దరు నల్లజాతి కొజ్జాలను, ఇరవైమంది సైనికులను మాకు కాపలాగా పెట్టారు. యుద్ధంలో తురుష్కులు చాలామంది రష్యన్లను చంపేశారు. మమ్మల్ని మాత్రం పస్తులు పెట్టకుండా దొరికిన తిండినల్లా తీసుకొచ్చి ఇచ్చేవాళ్లు. తర్వాత రష్యన్లు పైచేయి సాధించారు. అజోవ్‌ను నామరూపాల్లేకుండా తగలబెట్టారు. ఆడామగా, ముసలీముతకా తేడా లేకుండా అందర్నీ కత్తులతో పొడిచి చంపారు. ఇక మిగిలింది మేమున్న చిన్న కోట మాత్రమే. కోటలోపలికి తిండి అందకుండా చేసి మమ్మల్ని ఆకలితో మాడ్చి చంపాలనుకున్నారు. మా సైనికులు మాత్రం లొంగిపోయే ప్రసక్తే లేదని భీకర ప్రతిజ్ఞ చేశారు. అయితే ఆకలి మాడగట్టడంతో తమ ప్రతిజ్ఞ ఎక్కడ భంగమవుతుందోనని భయపడిపోయి కాపలా కొజ్జాలిద్దరినీ చంపి తినేశారు. తర్వాత మా ఆడవాళ్లను తినాలని నిర్ణయించుకున్నారు.   

మా కోటలో ఓ మహమ్మద్ మతబోధకుడు ఉండేవాడు. అతనికి దైవభక్తీ, దయాగుణమూ మెండు. మమ్మల్నందర్నీ ఒకేసారి చంపితినొద్దని సైనికులకు ఎంతో అద్భుతంగా బోధించాడు. ‘‘ముందు ఒక్కొక్కరికీ ఒక్కో పిర్ర కోయండి. వాటితో పసందైన భోజనం సిద్ధమవుతుంది. సరిపోకపోతే ఇంకో నాలుగు రోజులు పోయాక కావలసినంత కోసుకు తినండి. ఇలాంటి ధార్మిక కార్యక్రమాలతో అల్లా ఎంతో హర్షిస్తాడు. ఈలోపల ముట్టడి కూడా ముగిసిపోతుంది’’ అని ఉపదేశించాడు.  

అతని గొప్ప  సలహా, చాతుర్యమూ మా సైనికులకు తెగనచ్చేసింది. ఫలితంగా మేం భయానకమైన ఈ శస్త్ర చికిత్సకు గురయ్యాం. చిన్నపిల్లలకు సున్తీ చేశాక రాసే మందును ఆ మతబోధకుడు మాకు రాశాడు. మేమంతా మృత్యువాకిట పడుండిపోయామంటే నమ్మండి. 

తురుష్క సైనికులు మా పిర్రల వంటకాన్ని ఇలా తిన్నారో లేదో రష్యన్ సైనికులు అలా బల్లపడవలపై వచ్చేసి కోటను చుట్టుముట్టేశారు. మా సైనికుల్లో ఒక్కడూ తప్పించుకోలేకపోయాడు. రష్యన్లు మా వంక కన్నెత్తి కూడా చూడలేదు. కానీ, ఈ సువిశాల ప్రపంచంలో మీరెక్కడికెళ్లినా ఫ్రెంచి వైద్యులు కనిపిస్తారు చూడండి.. వాళ్లలో ఒక తెలివిమంతుడు మాపై ఎంతో శ్రద్ధ తీసుకుని, గాయాలు మాన్పాడు. కానీ నయమయ్యాక... అతడు నాతో పడుకుంటావా అని నన్ను అడగడాన్ని మాత్రం ఈ జన్మకు మరచిపోను. అతడు మమ్మల్ని ఓదార్చి, అంతా మంచే జరుగుతుందని చెప్పాడు. ఇలాంటి కోసుకు తినడాలు గతంలో ఎన్నో ముట్టళ్లలో యుద్ధ ధర్మసూత్రాల ప్రకారమే జరిగాయని వివరించాడు.

మాకు నడవడానికి కాస్త శక్తి రాగానే మమ్మల్ని మాస్కోకు పంపారు. నన్ను ఓ రష్యన్ పెద్దమనిషి కొనుక్కుని తోటమాలిగా పెట్టుకున్నాడు. రోజుకు ఇరవైసార్లు కొరడాతో చావగొట్టేవాడు. రెండేళ్ల తర్వాత అతన్ని, మరో ముప్పై మంది పెద్దమనుషులను ఏదో నేరానికి కోర్టు కొరత వేసి చంపింది. దీన్ని అవకాశంగా తీసుకుని ఇంట్లోంచి పారిపోయాను. రష్యా అంతటా తిరిగాను. కొన్నాళ్లు రీగాలో ఓ సత్రంలో సారాయి పోశాను. 
తర్వాత  రోస్తోక్, విస్మార్, లీప్జీగ్, కాసెల్, ఉట్రెట్, లీడెన్, హేగ్, రోటర్‌డామ్‌లలో దాసీగా పనిచేశాను. ఈ ఒంటి పిర్రతోనే దుర్భర దారిద్ర్యం, దారుణ అవమానాలను భరిస్తూ ముసలిదాన్నయ్యాను. అయితే నేను పోప్ కూతురిని అన్న సంగతిని ఏనాడూ మరవలేదు సుమా. ఆత్మహత్య చేసుకోవాలని వందలసార్లు అనుకున్నాను. కానీ ఇప్పటికీ నాకు బతుకుపై తీపి చావలేదు. ఈ వెర్రి బలహీనత మనందరిలోనూ ఉండే పాడుబుద్ధుల్లో ఒకటి. ఎందుకంటారా? నేలకు విసిరికొట్టాల్సిన బరువును దిక్కుమాలిన ఉత్సాహంతో మొయ్యడం, ఛీఛీ.. ఇదేం బతుకు అని ఏవగించుకుంటూనే.. దాన్నే పట్టుకుని వేళ్లాడ్డం, కాటేయబోతున్న పాముకు పాలు పొయ్యడంకంటే బుద్ధితక్కువతనం మరొకటి లేదు కనక!

నా తలరాత ప్రకారం అలా నేను తిరిగిన నానా దేశాల్లో, పనిచేసిన సత్రాల్లో.. బతుకుపై రోసిపోయిన వాళ్లను లెక్కలేనంతమందిని చూసి ఉంటాను. కానీ వాళ్లలో కేవలం పట్టుమని పన్నెండుమంది మాత్రమే తమ బాధలను బలన్మరణంతో అంతం చేసుకున్నారు... ముగ్గురు నీగ్రోలు, నలుగురు ఆంగ్లేయులు, నలుగురు స్విస్‌లు, రోబెక్ అనే ఒక జర్మన్ తత్వవేత్తా! ఇప్పటికి నా బతుకు చివరి విడత ఆ యూదు డాన్ ఇసాకర్ ఇంట్లో దాసీగా ముగిసింది. అతడు నీ పరిచర్యల కోసం నన్ను నియమించాడు. ఇప్పుడు నా బతుకు నీ భవితవ్యంతో, సాహసాలతో ముడిపడి ఉంది. నువ్వు నన్నలా కవ్వించకుండా ఉండకపోయినట్లయితే నేను నా ఈతిబాధల గురించి ఏనాటికీ చెప్పి ఉండేదాన్నే కాదు. ఇదొకటైతే, ఓడ ప్రయాణంలో కథలతో కాలక్షేపం చేయడం రివాజు కూడా కనక నా దురవస్థను బయటపెట్టాను. కనక అమ్మా, నేను అనుభవం గల ఆడదాన్ని. లోకం పోకడ ఏమిటో ఎరుగుదును. నీకు కాలక్షేపం కావాలంటే ఈ ఓడలోని ఒక్కొక్క ప్రయాణికుణ్ని అతని కథేంటో అడిగిచూడు. వాళ్లలో బతుకుపై రోయనివాడు, లోకంలో తనకంటే దౌర్భాగ్యుడు మరొకడు లేనేలేడని చెప్పని వాడు.. ఒక్కడంటే ఒక్కడున్నా సరే నన్ను ఉన్నపళంగా ఈ నడిసముద్రంలో తోసిపారెయ్యి..’ అని చెప్పి తన కథ ముగించింది ముసలమ్మ. 

(మళ్లీ వచ్చే శనివారం)